బీజేపీ ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా సమర్పించడానికి బాబుల్ సుప్రియో మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలవనున్నారు.భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లో చేరిన కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో అక్టోబర్ 19 న ఎంపీ పదవికి అధికారికంగా రాజీనామా చేయనున్నారు.
‘‘నేను అధికారికంగా ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చినందుకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ధన్యవాదాలు ’’ అంటూ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. ‘‘ఇకపై తాను బీజేపీ ఎంపీగా వచ్చే జీతాలు, ప్రోత్సాహకాలను తీసుకోను’’ అని ఆయన ట్వీట్ చేశారు.బాబుల్ సుప్రియో ఆగస్టులో పర్యావరణ, అటవీ శాఖ వాతావరణ మార్పుల సహాయ మంత్రిగా తన పదవికి రాజీనామా చేశారు.
తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నానని, తాను ఏ ఇతర రాజకీయ పార్టీలో చేరనని టీమ్ ప్లేయర్ గా కొనసాగుతానని గతంలో ఆయన స్పష్టం చేశారు.పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్తో బాబుల్ సుప్రియోకు ఉన్న వైరం కూడా ఆయన రాజకీయాలు విడిచిపెట్టడానికి ఒక కారణమని గతంలో వార్తలు వెలువడ్డాయి. తాను రాజకీయాల నుంచి వైదొలగాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని నెలల తరువాత బెంగాల్కు సేవ చేయడానికి గొప్ప అవకాశం కోసం తిరిగి వస్తున్నానని సుప్రియో పేర్కొంటూ టీఎంసీలో చేరారు.