సంస్కరణల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదవాళ్లను దోచి షావుకార్లకు దోచిపెడుతోందని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు. ఎమిదేళ్ల పాలనలో బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఉద్ధరించిందని ప్రశ్నించారు. వికారాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీపై మండిపడ్డారు.
సమైక్య పాలనలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. మళ్లీ అలాంటి పరిస్థితులు తేవొద్దని కేసీఆర్ చెప్పారు. బీజేపీని నమ్ముకుంటే వైకుంఠపాళిలో పామునోట్లో పడ్డట్లేనని వ్యాఖ్యానించారు. తెలంగాణకు మోదీ శత్రువు అని.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ జెండాను నమ్ముకుంటే ప్రజలకు శఠగోపం పెడతారన్నారు.
పారిశ్రామిక వేత్తలకు ఎన్పీఏల పేరిట రూ.20లక్షల కోట్లు దోచిపెట్టారని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో ప్రజలకు ఉపయోగపడే విషయం ఒక్కటీ లేదన్నారు. ప్రజలకు మంచి చేయకపోగా.. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయాలంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.