ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కిందనే అధికారులు పని చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే ప్రధాని నరేంద్ర మోదీ పాటించకుంటే ఎలా? అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. అలంకారప్రాయమైన గవర్నర్ వ్యవస్థతో ఏదో చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నారు.. ఏం చేయదలుచుకున్నారని కేసీఆర్ అడిగారు.
ప్రగతి భవన్లో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు.కర్ణాటకలో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టినా.. బీజేపీకి బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. మోదీ వంగి వంగి దండాలు పెట్టినా కూడా కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ఇలాంటి పరిణామాలు చూసి కూడా మోదీకి సర్కార్కు బుద్ధి రాలేదు.
అండమాన్ పాలనకు, ఢిల్లీ పాలనకు చాలా తేడా ఉంది. త్వరలో దేశం మొత్తం కూడా బీజేపీకి గుణపాఠం చెప్తుందన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుకే విలువ లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అని మండిపడ్డారు. ఆర్డినెన్స్ పాస్ కాకుండా చేసేందుకు లోక్సభ, రాజ్యసభలో అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మోదీ పాలనలో ఎమర్జెన్సీ కంటే దుర్మార్గమైన రోజులను చూస్తున్నామని తెలిపారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైన స్వతంత్రంగా పని చేసుకునేలా కేంద్రం సహకరించాలి. అలంకారప్రాయమైన గవర్నర్ పదవులతో రాష్ట్ర పాలనను అడ్డుకోవడం దుర్మార్గం అని కేసీఆర్ మండిపడ్డారు.