తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్లోని రాజ్ భవన్ కు చేరుకోగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి రాజ్ భవన్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు రాష్ర్టాలకు సంబంధించిన అంశాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా తొలిసారి గవర్నర్ సమక్షంలో జరుగుతున్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.