ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆవిష్కరణల సంస్థల ముఖ్యమైన కేంద్రాల ఏర్పాటుకు గమ్యస్థానంగా మారిన తెలంగాణ రాజధాని హైదరాబాద్కు మరో భారీ సంస్థ రాక ఖరారైంది. చైనాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ వన్ ప్లస్ + తన పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రం (రీసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్ సెంటర్(ఆర్ ఆండ్ డీ) కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. బెంగళూరును కాదని హైదరాబాద్ను తన గమ్యస్థానంగా వన్+ సంస్థ ఎంచుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, వన్+ సంస్థ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘భారతదేశంలోని మా ఆర్ ఆండ్ డీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం పట్ల మేం ఎంతో ఉత్కంఠగా ఉన్నాం. ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలోని మా అవసరాలకు తగిన రీతిలో సేవలు అందించేందుకు, మా భాగస్వామ్యులతో కలిసి పనిచేసేందుకు మరింత అవకాశం దొరుకుతుంది’ అని సంస్థ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, ఈ నిర్ణయంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ‘వన్ప్లస్ ఇండియా…హైదరాబాద్కు మీకు స్వాగతం. సరైన కేంద్రాన్ని మీరు ఎంపిక చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నా’ అని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాగా, స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో సామ్సంగ్ తర్వాతి స్థానంలో వన్ ప్లస్ ఉంది. ఇటీవల ఆ సంస్థ విడుదల చేసిన ఫోన్లు 22 రెండు రోజుల్లోనే పదిలక్షల ఫోన్లు అమ్ముడుపోయాయి.
వన్ ప్లస్ సంస్థ హైదరాబాద్లో తన ఆర్ ఆండ్ డీ సెంటర్ను ఏర్పాటుచేయడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం నిరంతరాయంగా చేసిన కృషి ఉందని ఈ ప్రక్రియలో భాగస్వామి ఓ అధికారి వెల్లడించారు. భారతదేశంలో తన ఆర్ ఆండ్ డీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన వన్ ప్లస్ ఈ క్రమంలో బెంగళూరు, హైదరాబాద్ను పరిశీలించిందన్నారు. ‘వన్ప్లస్ ఇండియా ఎండీ వికాస్ అగర్వాల్ ఈ ఏడాది జూలైలో భారతదేశంలో దక్షిణాదిలో ఉన్న హైదరాబాద్ లేదా బెంగళూరులో ఎక్కడో ఒక చోట మా మొట్టమొటి ఆర్ ఆండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాం. భారతదేశంలో మా బ్రాండ్ను బలోపేతం చేసుకోవడం కోసం చైనా తర్వాతి కీలకమైన కేంద్రాన్ని నెలకొల్పనున్నాం’ అని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఐటీ శాఖ అధికారులు వన్ ప్లస్ ఉన్నతవర్గాలతో సమావేశం అయింది. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమలకు కల్పిస్తున్న సదుపాయాలు, ఇన్సెంటివ్లు, హైదరాబాద్లో ఉన్న పరిపాలన సంబంధమైన విషయాలు, శాంతిభద్రతలు మరియు ఇతర అంశాల గురించి తెలియజెప్పింది. వరుసగా సమాలోచనలు జరిపిన అనంతరం వన్ ప్లస్ ముఖ్యులు రాష్ట్రంలో పర్యటించి ఇక్కడే తమ కేంద్రాన్ని ఏర్పాటుకు సిద్ధమయ్యారని వివరించారు. తొలి దశలో మూడు వందల ఉద్యోగాలను వన్ ప్లస్ కల్పించనుందని సమాచారం .