ఈ నెల 21న హుజుర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు హుజూర్ నగర్ టీఆర్ఎస్ పార్టీ ఎన్నిక ఇంచార్జ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు అయ్యాయి అని ఆరోపించారు. ఈ ఉప ఎన్నికలో గెలవలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ ముందు మోకరిల్లాడు. కేంద్రం అండతో టీఆర్ఎస్ కార్యకర్తలందరి ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. ఇంత వరకు తమ కార్యకర్తల వద్ద ఒక్కపైసా కూడా దొరకలేదు. మూడు రోజుల నుంచి టీఆర్ఎస్ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. హుజుర్నగర్ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా అంతిమ విజయం టీఆర్ఎస్దేనని పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓడిపోయిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. జైలు చిప్పకూడుకు అలవాటుపడ్డ రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు పోవడం ఖాయమన్నారు. కొడంగల్లో రేవంత్ను ఓడగొట్టాం. పెద్ద నాయకుడిని అవుతానని రేవంత్రెడ్డి పగటి కలలు కనడం మానుకోవాలి. హుజుర్నగర్ ప్రజల తీర్పుతో రేవంత్ నాలుక కత్తిరిస్తాం అని ఎమ్మెల్సీ పల్లా అన్నారు.
