తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యం అని రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది మండలంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో రామకృష్ణా రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. రామకృష్ణా రెడ్డి మంచి నాయకుడు అని ప్రశంసించారు. కేసీఆర్ నాయకత్వంలో కంది మండలం ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రూ.80 కోట్లతో కంది-శంకర్ పల్లి రోడ్డు వేస్తున్నామన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్కార్ ఆస్పత్రుల్లో డెలివరీలు జరుగుతున్నాయన్నారు. కాంగ్రెస్ హయాంలో అసలు డాక్టర్లే ఉండేవారు కాదని పేర్కొన్నారు. నాడు కరెంట్ లేక ఫ్యాక్టరీలు మూతబడ్డాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కరెంట్ కోతలే లేవని చెప్పుకొచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్గా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగు నీటిని అందిస్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీలతో సంగారెడ్డికి ఒరిగిందేమీ లేదన్నారు. ఇంకా అభివృద్ధి కావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు హరీష్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణలో చేపట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. దేశమంతా తెలంగాణ పథకాలను అమలు చేయాలని చూస్తోందన్నారు.