గ్యాంగ్స్టర్ నయీం పోలీసుల ఎన్కౌంటర్లో హతమైనా.. అతని అనుచరుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. నయీం కేసులో పీడీ యాక్ట్లో అరెస్టు అయి ప్రస్తుతం వరంగల్ జైళ్లో ఉన్న అతని ప్రధాన అనుచరుడు పాశం శ్రీనివాస్ ఇంకా సెటిల్మెంట్లకు పాల్పడుతున్నట్లు బాధితులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పాశం శ్రీనుకు పోలీసుల నుంచి కూడా సహకారం అందుతోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
జైలు నుంచి కోర్టుకు తరలించే దారిలో దాబా హోటళ్ల వద్ద భోజనాలకని ఆపి భూ సెటిల్మెంట్లకు పాల్పడుతూ బెదిరింపులకు దిగుతున్నాడని బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనికి అతని వెంట ఉన్న పోలీసులు కూడా వంత పాడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు మరో ఐదుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులకు సహకరించిన నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు.