అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం బొమ్మనదేవుపల్లిలో నిర్మించే 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణానికి మంత్రి పోచారం శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాంలో పేదల ఇంటి నిర్మాణానికి కేవలం రూ.70 వేలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్ని వసతులతో పేదలకు ఇళ్ళు కట్టించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ధనవంతులైనా, పేదవారైనా ఆత్మగౌరవం ఒక్కటేనన్నారు. రెండు పడక గదులు, హాల్, కిచెన్, ఎటాచ్డ్ బాత్ రూంలతో ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో సుమారు 8.50 లక్షల కుటుంబాలకు స్వంత ఇళ్ళు లేవని తేలింది. ఆలస్యమైనా విడతల వారిగా ఇళ్ళు లేని వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు.
