తెలంగాణ అభివృద్ధి అడుగడుగునా అడ్డుపడుతున్న తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత, కంచర్ల భూపాల్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ సముచిత గౌరవం ఇచ్చింది. తెలంగాణ భవన్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ భూపాల్ రెడ్డిని నల్గొండ ఇంచార్జ్ గా నియమిస్తున్నామని ప్రకటించారు. దుబ్బాక నర్సింహారెడ్డికి రాష్ట్ర స్థాయి పదవిని ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని వివరించారు.
ఈ చేరిక సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 2014లో టీడీపీ పార్టీ మోసం చేసి టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండిపెండెట్ గా పోటీ చేసి మెజార్టీ ఓట్లు సాధించానని తెలిపారు. గుత్తా సుఖేందర్ రెడ్డి 2009లో టీడీపీని వీడి కాంగ్రెస్ కు వెళ్లకుంటే ప్రజలు కోమటిరెడ్డిని ఆనాడే తరమీకొట్టేవాళ్ళని తెలిపారు. తమ కుటుంబం కాంగ్రెస్ కు వ్యతిరేకమని భూపాల్ రెడ్డి తెలిపారు. తన అధిష్టానం నల్లగొండ ప్రజలని భూపాల్ రెడ్డి వివరించారు. వారి కోరిక మేరకు టీఆర్ఎస్ లో చేరుతున్నానని వివరించారు.
చేయిలెనోడు ఏం చేయలేడని కోమటిరెడ్డి అవహేళన చేస్తున్నాడని భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ నడిబొడ్డున గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డిని నల్గొండ నుంచి తరమడమే తమ లక్ష్యమని భూపాల్ రెడ్డి తెలిపారు.