మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ. 65.56 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1954లో చేపట్టి 1961లో పూర్తి చేశారని మంత్రి గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను గత ప్రభుత్వాలు చేపట్టలేదన్నారు. తూములను, కాలువలను ఆధునీకరించలేదని మంత్రి గుర్తు చేశారు. 30 వేల ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టు 20 వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోతుందన్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీష్రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్.. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమీక్షించి రూ. 65.56 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారన్నారు. సూర్యాపేట జిల్లాలోని 3 మండలాల్లోని 22 గ్రామాలకు 15 వేల ఎకరాలకు, కుడి కాలువ కింద ఉన్న మూడు మండలాల్లోని పలు గ్రామాలకు 14 వేల ఎకరాలకు పైగా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామని మంత్రి ఉద్ఘాటించారు.
