స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ మరో రికార్డును తన సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా అందించిన 24 గంటల విద్యుత్ సరఫరా ప్రక్రియ విజయవంతమైంది. మొదట వారం రోజులు మాత్రమే ప్రయోగాత్మకంగా విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించిన సర్కారు, మరింత అధ్యయనం కోసం రెండు వారాలపాటు కొనసాగించింది. మంగళవారం నుంచి మళ్లీ 9గంటల విద్యుత్ను వ్యవసాయానికి సరఫరా పునరుద్ధరించనున్నట్టు ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తెలిపారు. ఆదివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిసిన ఆయన, రెండువారాల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం వల్ల వచ్చిన ఫలితాలు.. తలెత్తిన సమస్యలు.. వాటిని పరిష్కరించుకొంటూ లైన్లను పటిష్ఠపరిచిన వైనాన్ని సమగ్రంగా వివరించారు.
24 గంటల విద్యుత్ సరఫరా చేయడంవల్ల విద్యుత్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, 400 కేవీ సబ్స్టేషన్ల వరకు ఏవిధంగా లోడ్ పడుతున్నదనే విషయాన్ని సీఎండీ తెలియజేశారు. సోమవారం అర్ధరాత్రితో ఈ గడువు ముగుస్తున్నందున.. తిరిగి మంగళవారం నుంచి వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ప్రభాకర్రావు సీఎం కేసీఆర్కు వెల్లడించడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. ఇప్పటివరకు ఎక్కడెక్కడైతే లోపాలున్నాయో వాటన్నింటినీ సరిచేసి విద్యుత్ వ్యవస్థను మరింత పటిష్ఠంగా సిద్ధంచేయడానికి 40 రోజుల గడువు విద్యుత్ సంస్థలకు ఉంటుంది కాబట్టి, నూతన సంవత్సర కానుకగా మొదలవుతున్న 24 గంటల విద్యుత్ సరఫరాలో ఎక్కడా కూడా అవాంతరాలు ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ట్రాన్స్కో సీఎండీని ఆదేశించారు. ఇదేసమయంలో రైతులు ఆటో స్టార్టర్లు తొలిగించడానికి డిసెంబర్ 5 నుంచి స్పెషల్డ్రైవ్ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రికి సీఎండీ తెలిపారు.
రైతులకు అవగాహన కలిగించడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి సమన్వయంతో ఆటో స్టార్టర్ల తొలిగింపు కార్యక్రమం చేపట్టాలని సీఎం సూచించారు. ఆటోస్టార్టర్ల వల్ల భూగర్భ జలాలు అంతరించడం, ఇతర అనర్థాలను రైతులకు విడమర్చి చెప్పాలని, ఈ మేరకు గ్రామాల్లో పర్యటించాలని ఆయన విద్యుత్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 6 అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో ఉన్న 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 24 గంటల విద్యుత్ సరఫరాచేసింది. మొదట వారం రోజులు మాత్రమే చేయాలని భావించినప్పటికీ, ట్రాన్స్ఫార్మర్ల నుంచి 400 కెవి సబ్స్టేషన్ల వరకు పడే భారాన్ని, ఒత్తిడిని లోతుగా అధ్యయనం చేయడం కోసం నిరంతర విద్యుత్ సరఫరాను రెండు వారాలకు పొడిగించారు. సోమవారం అర్ధరాత్రి వరకు 24గంటల విద్యుత్ సరఫరా చేయనున్న విద్యుత్సంస్థలు మంగళవారం నుంచి యథావిధిగా 9 గంటల సరఫరాను పునరుద్ధరిస్తాయి. 2018 జనవరి 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతులకు, ఇతరవర్గాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభాకర్రావు స్పష్టంచేశారు.
Post Views: 466