నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన చర్చలు ఫలించాయి. సెర్ప్ ఉద్యోగులు సమ్మె విరమించారు. ఎలాంటి షరతులు లేకుండానే సమ్మెను విరమిస్తున్నట్లు సెర్ప్ ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. తమ డిమాండ్ల సాధనకు 34 రోజులుగా సెర్ప్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె ముగిసింది.రేపటినుంచి విధులకు హాజరుతామని నేతలు ప్రకటించారు.
శనివారం రాత్రి పొద్దుపోయేంత వరకు మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంలో సెర్ప్ ఉద్యోగుల జెఎసి ఎంపి కవిత నేతృత్వంలో చర్చలు జరిపారు. సెర్ప్ ఉద్యోగులు అటు హైదరాబాద్ లో, ఇటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఎంపీ కవిత ను కలిసి తమ సమస్యను వివరించారు. స్పందించిన కవిత మంత్రి జూపల్లి కృష్ణారావు తో మాట్లాడారు. ఇప్పటికే రెండు దఫాలుగా చర్చలు జరిగిన నేపథ్యంలో కొన్ని డిమాండ్లపై సెర్ప్ జేఏసీ వెనక్కి తగ్గింది. దీంతో మళ్ళీ చర్చలు జరిగేందుకు అవకాశం ఏర్పడింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తమకు నమ్మకం ఉందని…సమయానుకూలంగా ఆయన మా డిమాండ్లను పరిష్కరిస్తారని..దీని కోసం ఎలాంటి గదువునూ తాము కోరడం లేదని చర్చల అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ కవిత సమక్షంలో సెర్ప్ జీఏసీ రాష్ట్ర నాయకులు ఏపూరి నర్సయ్య, కుంట గంగాధర్ రెడ్డి, జి. మహేందర్రెడ్డి, జి సుభాష్ గౌడ్ లు ప్రకటించారు. చర్చల్లో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్, నారాయణ పాల్గొన్నారు.