ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులను కట్టి తీరుతాం.. ఉద్యోగాల భర్తీ చేసి తీరుతామని పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జేఏసీని నిరుద్యోగులు, ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. విద్యార్థుల్ని, యువకులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా కోదండరాం మాట్లాడటం సరికాదన్నారు. కొలువుల కొట్లాట సభకు నిరుద్యోగుల నుంచి పెద్దగా స్పందన రాలేదన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని అయన మండిపడ్డారు. విద్యార్థి మురళి ఆత్మహత్యను రాజకీయం చేయడం బాధాకరమన్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ జీవో నెం. 16 ఇస్తే కోర్టుకు పోయింది మీరు కాదా? అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులపై విపక్షాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయని ధ్వజమెత్తారు. ఒక వేళ మీకు కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రేమ ఉంటే కేసులను విత్డ్రా చేసుకోవాలని ఎమ్మెల్సీ పల్లా డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు అడ్డుపడినట్లే ఉద్యోగాల భర్తీకి కూడా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.