తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అంతర్జాతీయ కంపెనీల సీఈఓలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు కోరారు. జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈఓ జాన్ ఫ్లానరీ, వాన్చూ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ విశాల్ తో మంత్రి కేటీఆర్ ఢిల్లీలో సమావేశమయ్యారు. పరిశ్రమల స్థాపనకు, పెట్టుబడుదారులను ఆకర్షించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ, ఇండస్ట్రియల్ పాలసీలను కేటీఆర్ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. పెట్టుబడుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌళిక వసతులు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం తీసుకువచ్చిన సులభతర మార్గాలను వారికి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అంతర్జాతీయ ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ శాఖలను ఏర్పాటు చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోనే వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందని, అభివృద్ధి, అన్ని రంగాల్లో అనువైన ప్రాంతంగా తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు.
జనరల్ ఎలక్ట్రిక్ సంస్థ చైర్మన్, సీఈఓ జాన్ ఫ్లానరీ, వాన్చూ కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ విశాల్ లతో అర్థవంతమైన చర్చలు జరిగాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్లు పారిశ్రామిక వేత్తలు తెలిపారని వివరించారు. పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తో పాటు ఢిల్లీలో తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్ పాల్గొన్నారు.