తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ సృష్టించిన కొత్త, విప్లవాత్మక ప్రయత్నానికి విశేష స్పందన వచ్చింది. టౌన్హాల్ మీటింగుల పేరుతో పాలనలో ప్రజలను భాగస్వాములను చేయడం దేశంలోనే సరికొత్త విధానంగా చెప్పవచ్చు. ఈ తరహా విధానాన్ని అమలుచేస్తున్న చేస్తున్న రాష్ట్రాల్లో గోవా తరువాత మన రాష్ట్రమే కావడం విశేషం. నగరంలో శనివారం పురపాలకశాఖ మంత్రి కే.టీ. రామారావు ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనే ఈ సమావేశంలో కాలనీ సంఘాలు, బస్తీ సంఘాలు, మహిళా స్వయం సహాయక సంఘాలు, సీనియర్ సిటిజన్స్ సంఘాల ప్రతినిధులు, స్ట్రీట్ వెండర్స్, ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారు.
పాలనలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యానికి పరిపూర్ణత చేకూరుతుందనడంలో సందేహంలేదు. ముఖ్యంగా స్థానిక సంస్థల విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే, క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ద్వారా తీసుకునే విధాన నిర్ణయాలు ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందుతాయి. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహా విధానానికి శ్రీకారం చుట్టింది. ‘అప్నా షహర్’ పేరుతో టౌన్హాలు మీటింగులను ఏర్పాటుచేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల మనసునుంచి వచ్చే అభిప్రాయాలు, సమస్యలు(దిల్ కీ బాత్) తెలుసుకునే వినూత్న విధానాన్ని ప్రారంభించారు.
పాలకుల వరకు చేరని సమస్యలు, ప్రజలకు ఉపయోగపడే విధాన నిర్ణయాలకు టౌన్హాలు మీటింగులు వేదిక మారుతున్నాయి. ఉదాహరణకు ప్రభుత్వం తరుపున తడి, పొడి చెత్తను విడదీయడం వల్ల కలిగే ప్రయోజనాలు, కలిపి వేయడంవల్ల జరిగే నష్టాలను వారికి వివరిస్తే, ప్రజా సంఘాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ప్రస్తుత విధాన నిర్ణయాల్లో లోపాల కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను సోదాహరంగా వివరిస్తున్నారు. 50మైక్రాన్లకన్నా తక్కువ మందంగల ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విషయంలో పాలకవర్గం ఆలోచన, ప్రజల సహకారంలో ఎదురవుతున్న సమస్యలపై ఈ సందర్భంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది. సాక్షాత్తూ ప్రజా సంఘాలే ఇందులో పాల్గొంటున్నందున వారి సమ్మతితోనే విధానాలు అమలుచేసేందుకు మార్గం సుగమం అవుతుంది.
ఒకవేళ ప్రభుత్వ విధానాల్లో లోపాలున్నట్లు వెల్లడిస్తే, అవి వాస్తవమని భావిస్తే చట్టాలను సైతం సవరించుకునే వీలు కలుగుతుంది. రోడ్లు, డ్రైనేజీ, నాలాలు, మంచినీరు, విద్యుత్, ఫుట్పాత్లు, వీధిలైట్లు, పారిశుధ్యం తదితర క్షేత్రస్థాయి సమస్యల విషయమైతే అసలు చెప్పనక్కర్లేదు. టౌన్హాలు మీటింగుల్లో వీటికి తక్షణ పరిష్కారం లభించే వీలుంది. అంతేకాదు, రోడ్ల విస్తరణ, నాలాలపై ఆక్రమణల తొలగింపు తదితర విషయాల్లో ప్రధానంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటువంటివాటిని కూడా టౌన్హాలు మీటింగుల ద్వారా పరిష్కరించుకునే అవకాశముంది.
ఉదాహరణకు నాలా కబ్జాల కారణంగా స్థానికంగా ముంపు సమస్య ఎదురవుతుంటే ప్రజల సహకారంతోనే వాటిని తొలగించే ఆస్కారం కలుగుతుంది. స్ట్రీట్ వెండర్స్ తమ సమస్యలను చెప్పుకుంటే, స్ట్రీట్ వెండర్స్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను కూడా మరికొందరు చేప్పే వీలుంటుంది. అంతేకాదు, అక్కడే ఆయా సమస్యలను పరిష్కారానికి వారి ద్వారానే సూచనలు, సలహాలు తీసుకోవచ్చు. అంతేకాదు, అత్యుత్తమ సూచనలకు చట్టరూపం ఇవ్వడం, ప్రస్తుత చట్టాల్లో ఆ మేరకు సవరణలు చేయడం వంటివి చేసేందుకు ఆస్కారం ఉంటుంది.