తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ తన మనసులోని మాటను పంచుకున్నారు. మనం మారుదాం – నగరాన్ని మారుద్దాం అనే నినాదంతో అప్నా షహర్ కార్యక్రమం చేపట్టామని వెల్లడించిన మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించారు.
హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.హమారా బస్తీ – హమారా షహర్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ నగరానికే మణిహారమైన మెట్రో రైల్లో ఉమ్మివేయడం లాంటి పనులు చేస్తే ఎలాఅంటూ చురకలేశారు. `నిన్నే హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ నాతో చెప్పారు. అప్పుడే మనవాళ్లు మెట్రో రైల్లో పాన్లు ఉమ్మివేస్తున్నారని… ఇప్పుడు మన నగరం, మన మెట్రో, కలల ప్రాజెక్టు, భవిష్యత్లో హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలను పరిష్కరించే ప్రాజెక్టు దానిని కూడా శుభ్రంగా ఉంచుకోలేకపోతే ఎవరు క్లీన్ చేస్తారు?` అంటూ ప్రశ్నించారు.
మన ఇల్లు నీటుగా పెట్టుకున్నట్టు మన మెట్రోను కూడా క్లీన్గా ఉంచుకోవాలని… అందరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు కేటీఆర్. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ప్రజల తోడ్పాటుతోనే పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్న మంత్రి కేటీఆర్ క్రైమ్ రేటు పూర్తిగా తగ్గిందని స్పష్టం చేశారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు మనమంతా కలిసి నడువాలని కోరారు.