ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవంగా, ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడంతో పాటు సోమవారం నాడు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను సన్మానించినందుకు సీనియర్ నటుడు కృష్ణంరాజు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సినీ ప్రముఖులందరూ హాజరైన వేడుకకు తాను హాజరుకాకపోవడం కేవలం సమాచార లోపమేనని, మరే ఇతర కారణాలు లేవని ఆయన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు దుష్ప్రచారానికి చెక్ పెట్టారు.
‘ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోపన్యాసం విన్నాను. కృష్ణదేవరాయ పాత్ర పోషించిన నాకు.. అష్టదిగ్గజాల సమేతంగా స్వయంగా పండితుడై తెలుగు భాషను అత్యున్నత శిఖరాలకు చేర్చిన కృష్ణదేవరాయలు కేసీఆర్లో కనిపించారు. కేసీఆర్ వేల పుస్తకాలు, పద్యాలు చదివారని నాకు తెలుసు. అందుకే తెలుగు భాష మీద ఆయనకున్న పట్టు ఏమిటో ప్రారంభోపన్యాసంలోనే కనిపించింది. తెలుగు భాష మీద కేసీఆర్కు ఎంతటి అభిమానం ఉందో మహాసభల నిర్వహణలో, తెలుగుభాషను ప్రపంచవ్యాప్తం చేయడంలో కనిపించింది` అని ఆయన స్పష్టం చేశారు.
`బ్రహ్మాండంగా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు, యువనేత కేటీఆర్కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ స్ఫూర్తితో ప్రతి తెలుగువాడు తెలుగు జాతిని, తెలుగు ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయటానికి కృషి చేస్తారని కోరుకుంటున్నా’ అని కృష్ణంరాజు ఆకాంక్షించారు.