రాష్ట్రవ్యాప్తంగా ప్రజావైద్యాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా వైద్యశాఖలో పదివేల పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో రూ.55 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. అనంతరం దవాఖానలోని గదులను, వైద్య పరికరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో సర్కారు వైద్యంపై ప్రజలకు నమ్మకం పోయిందని, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడున్నరేండ్లలో ప్రజావైద్యానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. వైద్యశాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. అదేవిధంగా 108 వాహనాల తరహాలోనే గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను మరింత విస్తృతం చేసేందుకు సంకల్పించామని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 102 పేరుతో 40 వాహనాలను వైద్యసేవల కోసం ప్రారంభించినట్టు తెలిపారు. త్వరలోనే అన్ని ప్రాంతాల్లో 200 వాహనాలను ప్రారంభిస్తామని చెప్పారు.
ప్రభుత్వ దవాఖానల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉస్మానియా, గాంధీ వైద్యశాలల్లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య కేంద్రాల్లో 25 ఐసీయూ కేంద్రాలను, 40 డయాలసిస్ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు దవాఖాన ఆవరణలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, అధికారులు, నాయకులతో కలిసి మొక్కలు నాటారు.