పార్లమెంటు సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు జితేందర్ రెడ్డి కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేశారు. భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం భూమి సేకరించేందుకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని ఆయన కోరారు. పలు పథకాల కోసం భూమి సేకరణ ఇబ్బంది అవుతోందని గుర్తు చేశారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా సరైన పరిహారం అందజేశామని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు.
కొన్ని దశాబ్ధాలుగా నిరుపయోగంగా ఉన్న భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్రాన్ని అభ్యర్థించారు. నిరుపయోగంగా ఉన్న మిలిటరీ, రైల్వే భూములను రాష్ర్టాలకు అప్పగించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం నిర్మించే ఇండ్లకు అలాంటి స్థలాలను అందజేయాలన్నారు. మిలిటరీ, రైల్వే భూములను సేకరిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు.
సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ ఏరియా విషయంలో రక్షణ శాఖ అధికారులు కలిగిస్తున్న ఇబ్బందిని జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లారు. భూ సేకరణ బిల్లులో ఉన్న లోపాలను సరి చేయాలని ఆయన కోరారు. 1938 తర్వాత తెలంగాణలో తొలిసారి సమగ్ర భూసర్వే నిర్వహించినట్లు జితేందర్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి ల్యాండ్ సర్వేను గతంలో ఏ ప్రభుత్వం కూడా చేపట్టలేదన్నారు. తెలంగాణలో సుమారు 11 వేల గ్రామాల్లో భూసర్వే జరిగిందన్నారు. కొత్తగా రైతులకు ఈ-పాస్ బుక్లు ఇచ్చామన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా సాహసోపేతంగా, జాగ్రత్తగా భూసర్వే నిర్వహించిందన్నారు. కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి హైదరాబాద్ను సందర్శించి, తెలంగాణ చేపట్టిన భూసర్వే గురించి తెలుసుకోవాలని ఆయన ఆహ్వానించారు.