తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు తేదీలు తెరమీదకు వచ్చాయి. మూడు రోజుల పాటు అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం రెడీ అవుతోంది. బీసీ సబ్ ప్లాన్ తో పాటు, ఎస్సీ, ఎస్టీ అభివృద్ది, కొత్త పంచాయితీరాజ్ బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. జనవరి మొదటి వారంలోనే అసెంబ్లీ స్పెషల్ సెషన్స్ జరిగే అవకాశం ఉంది.
బీసీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. బీసీల అభివృద్ధిపై చర్చించిన ప్రజాప్రతినిధులు సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేయాలనే దానిపై ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చారు. బీసీలకు సబ్ ప్లాన్ తో పాటు చట్టసభల్లో రిజర్వేషన్ లాంటి కీలక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఈ అంశాలపై సభలో చర్చించి సర్కార్ తరుపున స్టేట్ మెంట్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభ్యుల డిమాండ్ ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుకు సర్కారు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి పెన్ డ్రైవ్ లో లక్ష పేజీల సమాచారాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ అంశంపై ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో స్టడీ చేసి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు రావాలని సీఎం సూచించారు. దళిత, గిరిజనుల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు లంబాడా, గిరిజనుల రిజర్వేషన్ల గొడవపై కూడా సీఎం సభలో స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు.
పంచాయితీ రాజ్ చట్ట సవరణపై కొన్ని రోజులుగా ప్రభుత్వం కృషి చేస్తోంది. షెడ్యూలు ప్రకారం జరిగితే వచ్చే ఏడాది జూలైలో పంచాయతీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రత్యేక సమావేశాల్లోనే పంచాయతీరాజ్ బిల్లుకు చట్ట రూపం తేవాలనుకుంటోంది. గ్రామస్థాయిలో జరిగే అవినీతికి సర్పంచ్ నే బాధ్యత చేస్తూ చట్టసవరణ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయితీల కు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం తోపాటు.. పంచాయితీలను మినీ సెక్ర టేరియేట్లుగా మార్చేలా చట్ట సవరణ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. గత నెలలో 16 రోజులు శీతాకాల సమావేశాలను నిర్వహించింది.