తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు కొత్త సంవత్సర కానుకను అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా వ్యవసాయరంగానికి 24గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్ను అందిస్తూ దేశంలోనే తొలిరాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలంటూ రాజస్థాన్ పత్రిక మంగళవారం సంపాదకీయం రాసింది.
`రైతుల స్థితిగతుల్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. కొత్త సంవత్సరపు తొలిరోజున రైతులకు తెలంగాణ ప్రభుత్వం అపురూప కానుకనందించింది. వ్యవసాయ రంగానికి 24గంటల నిరంతరాయ విద్యుత్ను ప్రారంభించి, దేశంలోనే ఆ ఘనత సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గత కొన్నేండ్లుగా వివిధ కారణాలతో దేశవ్యాప్తంగా అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఓసారి వరదలు ముంచెత్తితే, మరోసారి కరువు తాండవిస్తుంది. వాతావరణ ప్రతికూలత కారణంగా నష్టపోతున్న రైతులకు చివరకు కన్నీరే మిగులుతూ వస్తున్నది. సాగు ఖర్చులు కూడా చేతికిరాక అప్పులపాలవుతున్న స్థితిలో.. పలు రాష్ట్రాల్లో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ దేశంలోని ప్రతీ రాజకీయ పార్టీ, ప్రతీ ప్రభుత్వం రైతుల అభివృద్ధి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ వచ్చాయి. వాస్తవానికి ఒరిగిందేమీ లేదు. ఇదంతా ఓట్లరాజకీయాలతో ముడిపడిన వ్యవహారంగా మారిపోయింది.` అని పేర్కొంది.
` ఎన్నికల సమయంలో మాత్రమే నేతలకు రైతులు గుర్తొస్తారు. ఇలాంటి నిరాశాజనక వాతావరణంలో.. రైతుసంక్షేమం దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని స్వాగతించాల్సిందే. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలి. రైతుల గురించి ఆలోచించాలి. ప్రతీ రాజకీయపార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలిస్తుంటాయి. అధికారంలోకి రాగానే రైతుల కోసం ఏయే చర్యలు తీసుకుంటారో ధీమాగా చెబుతాయి. ముఖ్యంగా రుణమాఫీ, ఉచిత విద్యుత్, నిరంతర విద్యుత్కు సంబంధించి హామీలైతే మ్యానిఫెస్టోల్లో మొదటి ఐదు వాక్యాల్లోనే ఉంటాయి. తీరా ఎన్నికల్లో గెలిచాక ఆ ప్రభుత్వం కూడా రైతులకు కొత్తగా చేసేది ఏమీ ఉండదు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం అన్నదాతలు ఆందోళనబాట పట్టాల్సి వస్తున్నది. కడుపుమండి నిరసనకు దిగినవారిపై కాల్పులు జరుపుతున్న ఘటనలు ఇప్పుడు సాధారణ విషయాలుగా మారాయి. రైతులకు మేలు చేసే చర్యలకు బదులుగా ఇలాంటి సంక్షుభిత వాతావరణం ఎవరికీ ఆమోదనీయం కాదు. దేశానికి అన్నంపెడుతున్న రైతుకు తన వాటా తనకు ఎందుకు దక్కదు? అన్నదాతల సంక్షేమం జరుగనంతవరకు ఈ దేశం బలోపేతం కాదన్న వాస్తవాన్ని గ్రహించాలి. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా రైతుసమస్యల పరిష్కారంపై సమగ్ర చర్చ జరుగాలి. ఇదంతా ఎప్పుడో జరుగాల్సింది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు. తెలంగాణ ప్రభుత్వం అసాధ్యాన్ని ఎలా సుసాధ్యం చేసి చూపించిందో చూడండి.. ఇప్పుడిక మిగతా రాష్ట్రాల వంతు!` అని పేర్కొంది.