తెలంగాణ కుంభమేళగా పేరొందిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత సమ్మక్క సారలమ్మ పండుగ ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ ఏడాది జరుగుతున్న జాతరకు 80 కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. నిన్న సాయంత్రం కేంద్ర గిరిజనశాఖ మంత్రిని సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయపండుగగా ప్రకటించాలని కోరామని తెలిపారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ దఫా కోటి మంది భక్తులు వివిధ రాష్ట్రాలనుండి వస్తారని అంచనా వేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. జనవరి 30 నుండి నాలుగు రోజులు జరిగే జాతరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈరోజు ఉదయం ఉపరాష్టపతి వెంకయ్యనాయుడుని కలిశామని పేర్కొంటూ సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఉపరాష్టపతిని కోరామన్నారు. తప్పకుండా జాతరకు హాజరవుతానని ఉపరాష్టపతి హామీ ఇచ్చారని తెలిపారు. జాతరకు హాజరయ్యే మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా రాష్ట్రాల భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఐకే రెడ్డి వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రచారం కల్పిస్తున్నామని మంత్రి ఐకే రెడ్డి చెప్పారు. ప్రత్యేక హెలిప్యాడ్ లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు సరైన సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు.