తెలంగాణ హౌజింగ్ బోర్డుకు సంబంధించిన భూ వ్యవహరంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో చారిత్రక విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రూ.700 కోట్ల విలువ చేసే స్థలాన్నిరెండు దశాబ్ధాల సుధీర్ఘ న్యాయ పోరాటం తర్వాత తెలంగాణ హౌజింగ్ బోర్డు దక్కించుకుంది. కూకట్ పల్లిలోని సర్వే నంబర్ 1009 లోని 20 ఎకరాల భూమి తెలంగాణ హౌజింగ్ బోర్డుదేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్ధవంతంగా వాదనలు వినిపించిన న్యాయ బృందాన్ని వారు అభినందించారు. ఈ తీర్పు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ లాంటి శాఖలు ఇష్టారీతిగా రికార్డుల సవరణ చేయకుండా రూలింగ్ గా ఉపయోగపడుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసు వివరాల్లోకి వెళ్లితే….కూకట్ పల్లిలోని సర్వే నంబర్ 1009 లోని 20 ఎకరాల భూమికి సంబంధించి ఆంద్రప్రదేశ్ హౌజింగ్ బోర్డు, అజమున్నీసా బేగంకు మధ్య గత రెండు దశాబ్ధాలుగా వివాదం నడుస్తోంది. గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఆంధ్రప్రదేశ్ హౌజింగ్ బోర్డుకు అనుకూలంగా తీర్పునివ్వగా అజమున్నీసా బేగం హైకోర్టు డివిజన్ బెంచ్ నాశ్రయించగా, అజమున్నీసా బేగంకు అనుకులంగా తీర్పునిచ్చింది.
హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హౌజింగ్ బోర్డు 2010లో సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ముందు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేస్తూ ఈ 20 ఎకరాల భూమి హౌజింగ్ బోర్డుకే చెందుతుందని మే 1న చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ కేసులో వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీఎస్ నర్సింహా, హౌజింగ్ బోర్డు న్యాయవాది టి.వి.రత్నం, హౌజింగ్ బోర్డు ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ కే.వెంకటేశ్వర్లు, న్యాయధికారిణి పి.అరుణ కుమారి, వర్క్ ఇన్స్పెక్టర్ (న్యాయ విభాగం) బి.వెంకటేశ్వర్లు, ఈఈ విఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ ఈఈ రాధకృష్ణను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ప్రత్యేకంగా అభినందించారు.