తెలంగాణ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని రవాణాశాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసీ జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ని శిల్పారామం వద్ద రూ. 30 లక్షల తో పీపీపీ మోడల్లో నిర్మించిన ఏసీ బస్ స్టాండ్ ను ఆయన మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఎల్ఏ అరికేపుడి గాంధీ, జీహెచ్ఎంపీ కమీషనర్ జనార్థన్ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తో కలిసి ప్రారంభించారు.
రాష్ట్రంలో గతంతో ఏ ప్రభుత్వం హయాంలో ప్రజా రవాణా ఇవ్వనంత ప్రాధాన్యం సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఇస్తున్నారన్నారు. రూ.1400 కోట్లతో కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో రూ. 66 కోట్లతో బస్ స్టాండ్ ల ఆధునీకరణ చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలో బస్ ష్టేషన్ లను ఆధునీకరిస్తున్నామని వివరించారు. 826 బస్ షేల్టర్ లను పీపీపీ మోడల్లో ఆధునీకరిస్తున్నామన్నారు.ఇందులో 430 కొత్త బస్ షెల్టర్లను నిర్మిస్తుండగా, 396 పాత బస్ షెల్టర్లను ఆధునీకరిస్తున్నామన్నారు.
శిల్పారామం నుండి శంషాబాద్ కు 8 ఏసీ సర్వీసులను, కోటీ, ఎల్ బీ నగర్, సికింద్రాబాద్ , మెహిదీ పట్నంలకు రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచామన్నారు. ఏసీ బస్ షెల్టర్ లలో ఉచిత వైఫై, సీసీ కెమరాలు, హోటెల్, ఎల్ఈడీ బోర్డులు, బస్సుల రాక పోకల ఖచ్చిత సమాచారం అందించే డిజిటల్ డెస్టినేషన్ బోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థలో కొత్తగా 500 ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతామని వెల్లడించారు.