కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మంగళవారం ఉదయం మానకొండూరు మండలం చెంజర్ల వద్ద లారీ-ఆర్టీసీ బస్సులు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జుయిపోయింది. 40 మంది ప్రయాణికులతో కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను స్థానికులు, పోలీసులు బయటకు తీశారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సును ఢీకొన్న లారీ అంతటితో ఆగకుండా బస్సు వెనుకే వస్తున్న రెండు ద్విచక్రవాహనాలను సైతం ఢీకొంది. దీంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బస్సును.. కరీంనగర్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. రెండు లారీలు ఒకదానికొకటి ఓవర్టేక్ చేసుకుంటూ రావడంతో ఓ లారీ అదుపుతప్పి బస్సును వెనుక భాగంలో ఢీకొంది. దీంతో సగం బస్సు తునాతునకలైంది. ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికుల్లో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద ప్రాంతంలో మృతుల శరీర భాగాలు, రక్తంతో భయానక పరిస్థితి నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లారీ అతివేగంతో రావడం, రహదారి మధ్యలో డివైడర్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి..
చెంజర్ల ప్రమాదం గురించి తెలియగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రాణనష్టంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక ప్రమాద సంఘటన స్థలానికి చేరిన మంత్రి ఈటల రాజేందర్.. సహాయక చర్యలను పర్యవేక్షించారు.