తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఖైరతాబాద్ మహాగణపతి సప్త ముఖాలతో కాళ సర్ప దోష నివారకుడిగా ఈ సంవత్సరం దర్శనమివ్వనున్నాడు. మొత్తం 57 అడుగుల ఎత్తు.. 27అడుగుల వెడల్పు తో రూపుదిద్దుకుంటున్నాడు . మే 25న కర్ర పూజ తో అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయకచవితి పండుగకు వారంరోజులముందే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం రూపం పూర్తవుతుందని ఖైరతాబాద్ గణపతి విగ్రహ శిల్పి రాజేంద్రన్ తెలిపారు.
see also:నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి హరీష్ .
శాంత చిత్తంతో ఉన్న ఏడు గణపతి ముఖాలు, 14 చేతులు అందులో కుడి వైపు ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధతో కూడి ఆశీర్వదిస్తుండగా, ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉంటాయి. 57 అడుగుల గణపతికి మరో మూడు అడుగుల ఎత్తులో ఏడు తలల శేషుడు తన పడగతో నీడ కల్పిస్తాడు. వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి. గత ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రెండు వైపులా చిరు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడికి కింద నుంచి కుడి వైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీ దేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లు ఆశీనులై ఉంటారు. పాదల దగ్గర ఆయన వాహనం ఎలుక స్వామి వారికి భజన చేస్తూ కనిపిస్తుంది.గణేశుడికి మరో కుడివైపు ఈ ఏడాది కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ శ్రీనివాసుడి కల్యాణ దర్శన భాగ్యం కలిగిస్తున్నారు.