రాష్ట్రంలో ప్రముఖ సంస్థలు పరిశోధన, అభివృద్ధి కేంద్రాల ఏర్పాటు పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలు తమ రిసెర్చ్ ఆండ్ డెవలప్మెంట్(ఆర్అండ్డీ) సెంటర్లను ఏర్పాటు చేశాయి. తాజాగా చైనాకు చెందిన సెల్ఫోన్ దిగ్గజం ఒప్పో సైతం ఆర్ఆండ్డీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేసింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఆర్ఆండ్డీ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తున్నామని, ఈ కేంద్రం బాధ్యుడిగా తస్లీం ఆరిఫ్ను నియమిసున్నామని వెల్లడించింది. భారతదేశంలో మా వినియోగదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు, నూతన సాంకేతిక ఫలితాలను చేరవేసేందుకు ఇన్నోవేషన్, టెక్నాలజీ అంశాలపై దృష్టిసారించాం.
దీనికోసం కొత్త ఆర్ఆండ్డీ కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నాంఅని ఒప్పో ఇండియా ప్రెసిడెంట్ చార్లెస్ వాంగ్ సోమవారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఒప్పోకు ఇప్పటివరకు అమెరికా, చైనా, జపాన్లో ఆరు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. భారతదేశంలో ఏర్పాటు చేయబోయే ఈ కేంద్రం ఏడవది. ఒప్పో ఇండియా ఆర్ఆండ్డీ హెడ్గా నియమితులైన తస్లీం ఆరిఫ్, సాఫ్ట్వేర్ లోకలైజేషన్, డివైజ్ క్వాలిటీ అంశాలపై దృష్టిసారిస్తారని చార్లెస్ వాంగ్ వెల్లడించారు. ఒప్పోలో చేరడానికి ముందు శాంసంగ్ ఇండియా ఆర్ఆండ్డీ, హార్డ్వేర్-సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ప్లానింగ్ ఇంచార్జిగా తస్లీం వ్యవహరించారు. కీలక స్థానాల్లో పనిచేసిన తస్లీం అనుభవం తమకు ఉపయోగపడుతుందని వాంగ్ ధీమా వ్యక్తంచేశారు.