భారతదేశ చరిత్రలో మొదటి సారిగా సాగునీటి రంగంలో అత్యధిక మెగావాట్ల సామర్థ్యం కలిగిన పంపులను విజయవంతంగా ఉపయోగంలోకి తెచ్చిన ఘనత తెలంగాణ విద్యుత్తు సంస్థలకు దక్కడం ఆనందదాయకమని జెన్ కో – ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. 124.4 మెగావాట్ల కాళేశ్వరం ప్రాజెక్టు (మేడారం-ప్యాకేజి -6) మొదటి పంపు ట్రయల్ రన్ (వెట్ రన్) ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి, అందులో తెలంగాణ విద్యుత్ సంస్థల శక్తి సామర్ధ్యాలను నిరూపించుకునే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యానికి అనుగుణంగా. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు నడవడానికి కావాల్సిన విద్యుత్ సౌకర్యం అందించడానికి రెండేళ్లకు పైగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పని చేసిన విద్యుత్ సిబ్బందికి ప్రభాకర్ రావు అభినందనలు తెలిపారు. కాళేశ్వరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ఎత్తిపోతల పథకాలకు కావాల్సిన విద్యుత్తును ఎలాంటి ఆటంకాలు లేకుండా అందించడానికి పునరంకితం అవుతామని ఆయన ప్రకటించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా కొత్త రికార్డు సృష్టించిన విద్యుత్ సంస్థలు, ఎత్తిపోతల పథకాలకు రికార్డు స్థాయి ఏర్పాట్లు చేయడం గర్వకారణమన్నారు. సిఎం కేసీఆర్ మార్గదర్వకత్వంలో తెలంగాణ వ్యవసాయాభివృద్ధిలో విద్యుత్ సంస్థలు గణనీయమైన పాత్రను పోషించడం ఆనందదాయకమన్నారు.
విద్యుత్ శాఖ ‘రికార్డు స్థాయి’ ఏర్పాట్లు
భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రాష్ట్రంలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా అందించడానికి రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశాయి. ప్రాజెక్టును విజయవంతంగా నిర్వహించడంలో విద్యుత్ శాఖకున్న ప్రాధాన్యాన్ని మొదట్లోనే గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగా విద్యుత్ అధికారులను అప్రమత్తం చేశారు. విద్యుత్ శాఖ చరిత్రలోనే మొదటి సారిగా ట్రాన్స్ కో లో ఎత్తిపోతల పథకాలకు ప్రత్యేక డైరెక్టర్ (సూర్యప్రకాశ్)ను నియమించారు. జెన్ కో- ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యుత్, నీటి పారుదల శాఖ అధికారులు ప్రతీ వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించారు. ఆస్ట్రియా తదితర దేశాలు పర్యటించి పంపుల సామర్థ్యాన్ని మదింపు చేశారు. బిహెచ్ఇఎల్ తో ఒప్పందం చేసుకుని వివిధ ప్లాంట్లలో సమాంతరంగా ప్రత్యేక పంపులను తయారు చేయించారు. రూ.2,890 కోట్ల వ్యయంతో 5వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లను నిర్ణీత గడువులో పూర్తి చేశారు. మొత్తం 15 పంపుహౌజుల వద్ద 15 డెడికేటెడ్ సబ్ స్టేషన్లు నిర్మించారు. వివిధ కేటగిరీల్లో 80 పంపులు బిగించారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉంది. కానీ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణ విద్యుత్ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో 139 మెగావాట్ల పంపులు (ప్యాకేజీ 8 – రామగుడు) వాడుతున్నారు. భారతదేశంలో ఇంత భారీ సామర్థ్యంతో ఎక్కడా ఎవరూ పంపులు వాడలేదు. సముద్రమట్టానికి 550 మీటర్లకు పైగా ఎత్తుకు నీటిని పంపింగ్ చేసి, తెలంగాణ బీళ్లకు నదుల నీళ్లను మళ్ళించే బృహత్ కార్యానికి విద్యుత్ సంస్థలు ఇరుసుగా పనిచేస్తున్నాయి.