తప్పులెంచువారు తమతప్పులు తామెరుగరు అన్న చందంగా మారింది టీవీ9 రవిప్రకాశ్ పరిస్థితి. కెమెరా ముందు నీతులు వల్లెవేసే ఈ ప్రబుద్ధుడు ఆఫ్ ద రికార్డ్ మాత్రం చిల్లర పనులకు పాల్పడ్డాడు. నీతులు చెప్పేందుకే తప్పా.. ఆచరించేందుకు పనికిరావు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా తయారయ్యాడు టీవీ9 రవిప్రకాశ్. ఇంతకీ ఈ పెద్దమనిషి ఏం చేశాడనుకుంటున్నారా..? ఆయా రాష్ట్రాల్లో టీవీ9 పేరుతో తెలుగు, మరాఠీ, కన్నడ, గుజరాతీ, ఇంగ్లీషు, హిందీ వార్తా ఛానళ్లు నిర్వహిస్తున్న (ఏబీసీఎల్) సంస్థను పారిశ్రామికవేత్త శ్రీనిరాజుకు చెందిన చింతలపాటి హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐల్యాబ్స్ వెంచర్ కేపిటల్ ఫండ్ కలిపి ప్రారంభించాయి. ఏబీసీఎల్ కంపెనీ (టీవీ9)లో ఈ రెండు సంస్థలకు కలిపి మొత్తంగా 90 శాతానికి పైగా వాటా ఉంది. ఈ సంస్థలో ఓ ఉద్యోగిగా జాయిన్ అయిన రవిప్రకాశ్.. సీఈవో, డైరెక్టర్గా హోదా పొందాడు. రవిప్రకాశ్ సహా ఆయన సన్నిహితులు ఈ సంస్థలో 8 శాతం షేర్ హోల్డర్లు. ఏబీసీఎల్లో 90 శాతానిపైగా వాటా ఉన్న రెండు సంస్థల నుంచి ఆ వాటాను కొనుగోలు చేసేందుకు హైదరాబాద్కు చెందిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్కు ఆగస్టు 23, 2018న ఒప్పందం కుదుర్చుకుని ఆగస్టు 25న నగదు కూడా చెల్లించారు. ఇందుకు గాను కంపెనీ షేర్లు మొత్తంగా అలందా మీడియా పేరు మీద అదే నెల 27న డిమ్యాట్ రూపంలో ట్రాన్ఫ్ఫర్ కూడా చేశారు. ఇంతవరకు సజావుగా ఉన్నప్పటికీ సరిగ్గా ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది.
గత ఏడాదే ఏబీసీఎల్ (టీవీ9) యాజమాన్యం చేతులు మారడంతో అలందా మీడియా సంస్థ తరపున నలుగురు డైరెక్టర్లను ఏబీసీఎల్ డైరెక్టర్ల బోర్డులో నియమించేందుకు కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతూ కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు అధికారికంగా పంపించింది. ఈ తీర్మానాలపై ఒకసారి రవిప్రకాశ్, మరోసారి ఎంకెవీఎన్ మూర్తి అనే మరో డైరెక్టర్ ఏబీసీఎల్ డైరెక్టర్ల హోదాలో సంతకాలు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 29, 2019న అనుమతి మంజూరు చేస్తూ ఏబీసీఎల్కు సమాచారం పంపింది. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ, కొత్త డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించేందుకు రవిప్రకాశ్ అడ్డుపడుతూ వచ్చారని.. దీంతో ఏబీసీఎల్లో 90 శాతానికి పైగా వాటా పొందిన అలందా మీడియాకు చెందిన నలుగురు డైరెక్టర్లు ఏప్రిల్ 23, 2019న సమావేశమై తమ నియామకానికి చెందిన పత్రాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయంలో దాఖలు చేయాల్సిందిగా ఈ బాధ్యతలు నిర్వహిస్తున్న కంపెనీ సెక్రటరీని కోరారు. రవిప్రకాశ్, ఆయన సహచరులు ఎలాగైనా సరే అడ్డుకోవాలని ఆ కంపెనీ సెక్రటరీ రాజీనామా చేసినట్లు పాత తేదీలతో ఫోర్జరీ డాక్యుమెంట్ను సృష్టించారు. ఇదే విషయాన్ని అలందా కంపెనీ సెక్రటరీ రాతపూర్వకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్కు ఫిర్యాదు చేయడమే కాక, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాన్ని సృష్టించారని వివరించారు.
రవిప్రకాశ్కు కేవలం 8 శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేశారని సంస్థ యాజమాన్యం ఆరోపిస్తుంది. కంపెనీకి సంబంధించిన నిధులు మళ్లించారని, కీలక వ్యక్తుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ సీఈవో స్థానం నుంచి రవిప్రకాశ్కు పక్కనబెట్టింది టీవీ9. తన నిర్ణయాలే అమలు చేయాలని యాజమాన్యంపై ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు సమాచారం. కొత్త యాజమాన్యానికి నిర్వహణలో అడ్డుపడుతూ, చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అలందా యాజమాన్యం ఆరోపించింది. మెజార్టీ వాటా ఉన్నవారిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, సంస్థ నిర్వహణకు సంబంధించి రవిప్రకాశ్ చేసిన అక్రమాలపై టీవీ9 కొత్త యాజమాన్యం అతనిపై చీటింగ్ కేసు కూడా పెట్టింది. సంస్థకు హానిచేస్తూ కొందరు వ్యక్తులతో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.