విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంతంలో శ్రేష్టమయిన వాతావరణం ఉంటుంది. తెలంగాణలో ఉత్పత్తి అయిన విత్తనం ప్రపంచంలో ఎక్కడయినా పండుతుంది. తెలంగాణ లో విత్తనాల పంట పండాలి. ఆ విత్తనాలు ప్రపంచ పంటలకు ఆధారం కావాలి. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా రెండవరోజు హైటెక్స్ లో నిర్వహించిన విత్తన రైతుల సమావేశానికి అధ్యక్ష్యత వహించిన ఆయన రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచంలోని 771 కోట్ల మంది జనాభాలో ఏ ఒక్కరితోనో అన్నీ సాధ్యం కావని, ఏటేటా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరాలు పెరుగుతున్నాయని, వాటిని తీర్చేందుకు శాస్త్ర సాంకేతికత నవీకరణ అవసరం అని, దానిని ఆయా రంగాలకు ఆపాదించాలని తెలిపారు. పదివేల ఏళ్లక్రితమే వ్యవసాయం మొదలయిందని, ఈ 60 ఏళ్లలో వ్యవసాయంలో అనేక మార్పులు వచ్చాయని, అందుబాటులో ఉన్న సాంకేతికతను అనుసరిస్తూ సాంప్రదాయ వ్యవసాయం నుండి మన రైతులు బయటకు రావాలని నిరంజన్ రెడ్డి కోరారు.
పెరిగిన ఆయకట్టు ప్రాంతాలలో రైతుల ఆదాయాలు కూడా పెరిగాయని, వ్యవసాయ అనుబంధ రంగాలు కలిసి పనిచేయాలని, పంటల వైవిద్యీకరణ (డైవర్సిఫికేషన్)తో వ్యవసాయ లాభాలు వస్తాయని, విత్తన పంటల సాగే దానికి ప్రత్యామ్నాయమని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పంటలు సాగుచేయాలని నిరంజన్ రెడ్డి సూచించారు. రైతుల ఆదాయాలు పెరిగేందుకు రైతు సమన్వయ సమితిలు పనిచేయాల్సిన మార్గదర్శకాలు త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెల్లడిస్తారని, తెలంగాణ రాష్ట్రం సుసంపన్న రాష్ట్రంగా ఎదగడానికి రైతు సమన్వయ సమితిలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఒకప్పుడు ద్రాక్ష సాగుకు ప్రసిద్ది అని, ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు జరిగేవని, కాలక్రమంలో ద్రాక్ష పంటలు కనుమరుగు అయ్యాయని, మహారాష్ట్ర ద్రాక్ష రైతులు మేలైన సాగు విధానాలు అవలంభిస్తూ విదేశాలకు ద్రాక్ష ఎగుమతులు చేస్తున్నారని, తెలంగాణ రైతులు ద్రాక్ష సాగు తిరిగి చేపట్టి పూర్వవైభవం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆహారం అవసరం ఉన్నంత వరకు రైతే ప్రపంచానికి ఆధారం అని, భవిష్యత్ ఆహార భద్రతకు వీరే కీలకమని అన్నారు. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెంచడానికి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని, మిగిలిన రంగాలతో పోలిస్తే ఈ రంగంలోనే ఎక్కువమందిని భాగస్వాములను చేయగలమని, మారుతున్న ఆహారపు అలవాట్లే మన విత్తనాలకు ఎగుమతి అవకాశాలని తెలిపారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు, రైతుభీమా ఏ పథకం అయినా రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుకు భరోసానివ్వటమే ముఖ్య లక్ష్యమని నిరంజన్ రెడ్డి అన్నారు. ఆహార సమతుల్యతలో భాగంగా పండ్లు, కూరగాయల ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో తెలంగాణ రైతులు ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని కోరారు. మేలైన సాగు పద్దతుల ద్వారా మన దేశం నుండి ఎగుమతులు నిరాకరణకు గురవుతున్న సమస్యలను అధిగమించాలని నిరంజన్ రెడ్డి అన్నారు.