విశ్వమంతా విత్తన విప్లవం రావాలి. ప్రపంచ ఆకలి తీరాలి. ఆహార భద్రతతో మానవాళి సంతోషం మురవాలి. విత్తనం పుట్టుక మొదలు అభివృద్ది వరకు సమగ్ర చర్చ జరగాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. నోవాటెల్ లో జరిగిన అంతర్జాతీయ విత్తన సదస్సు ముగింపు సమావేశానికి హాజరయిన ఆయన సదస్సును ఉద్దేశించి ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. వ్యవసాయంలో విత్తనం చాలా కీలకం అని, కల్తీ విత్తనం అమ్మడం అంటే ఆత్మహత్యకు కారణం అయినట్లేనని, తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర విత్తన చట్టంతో కల్తీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపామని ఆయన తెలిపారు. తగ్గుతున్న నేలలు, నీటి వనరులు, కరంటు సదుపాయం నేపథ్యంలో ప్రపంచ మానవాళి భవిష్యత్ ఆహారభద్రతకు విత్తన విప్లవం రావాలని కోరారు.
గ్రామీణ రైతులు పట్టణాలకు వలస వెళ్తే ఆకలి తీర్చేదెవరు ? పట్టణాలకు గ్రామాల నుండి వస్తున్న వలసదారులకు ఉపాధి కల్పన ఎలా సాధ్యం ? నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయానికి అనువైన వాతావరణంతోనే రైతులను గ్రామాలలో ఉంచగలం అని, ఇస్టా లాంటి సదస్సుల మూలంగా ప్రపంచవ్యాప్తంగా సంతోష భీజాలు(seeds of happiness) వెల్లి విరియాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పారిశ్రామీకరణ తప్పనిసరి అని అదే సమయంలో వ్యవసాయ వనరులు తరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన నాణ్యమయిన విత్తనమే దీని పరిష్కార మార్గమని అన్నారు. విత్తనం పుట్టుక మొదలు అభివృద్ది వరకు సమగ్ర చర్చ జరగాలని, భూమిలో ఏది నాటితే అదే దిగుబడిగా అందుతుందని, కాబట్టి నాణ్యతపై సంపూర్ణ పరిశోధన జరగాలని సూచించారు. నాణ్యమైన విత్తనం, క్షేత్రం, సాగు, పంటకోత, సంతోషం ఒక చక్రంలా పనిచేస్తాయని అన్నారు.
మన దేశ ప్రజల జీవనానికి వ్యవసాయమే ప్రధాన ఆధారం అని, వారి ఆర్థికవృద్ది సాగు బాగుతోనే ముడిపడి ఉందని అన్నారు. ఈ సదస్సు నిర్వహణ ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా సంతోష భీజాలు(seeds of happiness) వెల్లి విరిసేందుకు దోహదపడాలని, సదస్సు నిర్ణయాలు రైతుల పొలాలలో అనువయించుకునేలా ఉపయోగపడాలని గవర్నర్ ఆకాంక్షించారు.