రైతన్నలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉచిత రైతు బీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. 2019, ఆగస్టు 14 నుంచి 2020, ఆగస్టు 13 వరకు ఈ పథకం అమలు కానుంది. రైతు బీమా పథకం ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులందరికీ రూ.3013.50 ప్రీమియంతో రూ.5 లక్షల బీమా కల్పించిన విషయం తెలిసిందే. గత ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రీమియంతో పాటు జీఎస్టీ, స్టాంప్ డ్యూటీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన రైతు బీమా పథకం ఆగస్టు 13 వరకే వర్తించనుంది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో పథకాన్ని మరో ఏడాది పొడిగించింది తెలగాణ ప్రభుత్వం. రూ. 934.19 కోట్లతో పథకాన్ని పొడిగిస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
