టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్, బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నీళ్లు పారుతున్న కాళేశ్వరాన్ని చూస్తే విపక్షాలకు కడుపుమంటగా ఉందన్నారు. తుమ్మిడిహట్టి వద్ద ఆశించిన స్థాయిలో నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ గతంలోనే తేల్చి చెప్పిందన్నారు. విపక్ష నేతలు ఇప్పటికీ తుమ్మిడిహట్టి పేరుతో చౌకబారు రాజకీయాలు చేస్తున్నారన్నారు. గతంలో తలపెట్టిన ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు అప్పటి ప్రభుత్వాలు తీసుకురాలేదన్నారు. కాగా ఇప్పుడు అన్ని అనుమతులతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్లు తెలిపారు.
