2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ. 52 వేల కోట్లు కాగా, 2018-19 ఆర్థిక సంవత్సరం నాటికి వంద శాతానికి పైగా పెరిగి లక్షా 10 వేల కోట్ల రూపాయాలకు చేరుకోవడం తెలంగాణ సాధించిన అద్భుత విజయానికి నిదర్శనమన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. రాబోయే రోజుల్లో మహబూబ్నగర్లో కూడా ఐటీ టవర్ను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఐటీ పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గడిచిన ఐదేళ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేశామని కేటీఆర్ తెలిపారు.
ఐటీఐఆర్ పాలసీ కింద యూపీఏ ప్రభుత్వం ఇవ్వలేదు. ఐటీఐఆర్ కొత్త ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. కేంద్రానికి దాదాపు పదిసార్లు నేరుగా కలిసి అడిగాం. లేఖలు రాశాం. నాటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వనందుకే ఐటీఐఆర్ ఇవ్వలేదని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖలను ఆ మరుసటి రోజే దత్తాత్రేయకు చూపించాం. మా పాలసీ ఐటీఐఆర్ కాదు. దాన్ని ముందుకు తీసుకెళ్లాం అని నాటి కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. బెంగళూరుకు, హైదరాబాద్కు మంజూరు చేశారు కానీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వారు ఇవ్వకపోయినంతా మాత్రాన ఐటీ అభివృద్ధి ఆగలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పాలసీలతో తెలంగాణలో 17 శాతం వృద్ధిని ఐటీ రంగంలో సాధించాం. ఉత్తర, దక్షిణ హైదరాబాద్లో కూడా ఐటీని ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.