విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి ధర్మ ప్రచార యాత్రలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గత మూడు రోజులుగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాల్లో స్వామిజీ పాల్గొంటున్నారు. మూడవరోజైన మంగళవారం నాడు స్వామివారు స్వయంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి అర్చన, హారతి, చండీ హోమం, చండీ పారాయన, దుర్గా పూజ, గౌరీ పూజ, లలితా సహస్ర నామార్చన తది తర కార్యక్రమాలు భక్తుల కోలాహలం మధ్య నిర్వహించారు.త్తర పీఠాధిపతులు స్వయంగా ఇచ్చిన అమ్మవారికి వివిధ రకాల హారతి, పంచామృతాలతో రుద్రాభిషేకం భక్తులను కట్టిపడేసింది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ స్వాత్మానంద సరస్వతి స్వామి వారు మాట్లాడుతూ… అమ్మవారికి ఎంతో ప్రీతి పాత్రమైన శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావించాలని అన్నారు. సృష్టికి మూలం అమ్మ అని, అమ్మ అదేశం, ఆశీస్సులు లేనిదే ఏమీ జరగదని, అమ్మవారిని భక్తి ప్రపత్తులతో కొలిచిన వారికి కోరిన కోరికలు నెరవేరతాయని అన్నారు. తెలంగాణా లోనూ నవరాత్రి ఉత్సవాలకు విశేష ప్రాధాన్యముందని చరిత్ర చెబుతోందని, ఇది బతుకమ్మ రూపంలో ప్రకృతిని ఆరాధించే పండుగ అని స్వామి వారు ప్రవచించారు. ఆది పరాశక్తిని ఆరాధిస్తేనే ప్రకృతి అందరిని చల్లగా చూస్తుందని, పాడిపంటలతో సస్యశ్యామలం అవుతుందని అభిలషించారు. దుర్గామాత, పార్వతీ మాత, కాళీమాత, అన్నపూర్ణా మాత, బ్రమరాంబికా, రాజరాజేశ్వరి మాత, మాణిక్యాంబికా మాత, లక్ష్మీ మాత, భద్రకాలి మాత, గోదామాత వంటి అనేక రూపాల్లో ఉన్న అమ్మవారిని ఆరాధిస్తేనే మానవ జన్మ సార్థకమై ముక్తి లభిస్తుందని స్వామి వారు ప్రవచించారు.
కాగా ధర్మ ప్రచార యాత్రలో భాగంగా శ్రీ స్వా త్మానందేంద్ర స్వామి వరంగల్ నగరంలో వేయిస్థంభాల గుడి, పైడిపల్లి పురాతన అమ్మవారి సమేత ఆలయం, గోవిందరాజుల గుట్టపై అభయాంజనేయస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాజాగా వరంగల్ లో ప్రఖ్యాతి చెందిన భద్రకాళి ఆలయాన్ని శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సందర్శించాలని భద్రకాళి ఆలయ చైర్మన్, అర్చకులు శేషు, ఈవో సునీత శ్రీ విశాఖ శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారిని ఆహ్వానించారు. మంగళ వారం హనుమకొండ హంటర్ రోడ్ లోని రాజ్యసభ సభ్యులు శ్రీ కెప్టెన్ వి. లక్ష్మికాంత రావు నివాస గృహంలో వారు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర స్వామి వారిని కలిసి దేవాలయ ప్రాముఖ్యతను, అభివృద్దిని, శరన్నవరాత్రుల ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణ గురించి వివరించగా స్వామి వారు ఆసక్తిగా విన్నారు. చారిత్రక పట్టణమైన ఓరుగల్లులోని ఎంతో విశిష్టమైన భద్రకాళి ఆలయాన్ని సందర్శించాలని వారు కోరారు. ఈ మేరకు స్వామివారు భద్రకాళీ ఆలయ సందర్శనకు అంగీకారం తెలిపారు.