సిద్ధిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట రూరల్ మండలం ఇర్కోడ్ గ్రామ శివారు గుట్ట వద్ద రూ.2కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ ఐటీఐ కళాశాల నిర్మాణ పనులను సోమవారం మధ్యాహ్నం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న విద్యా సంవత్సరానికి కళాశాలను అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 4నెలల్లో జనవరి నెలలోపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు జరగాలని ఇంజనీరింగ్ వర్గాలను ఆదేశించారు. ఈ మేరకు ఐటీఐ కళాశాల భవన నిర్మాణ మ్యాపును క్షుణ్ణంగా పరిశీలించి పనుల్లో జాప్యమెందుకని ఆర్అండ్ బీ అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజన్సరు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.