ఈ నెల 21 హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తున్నారు. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.. ఎంపీ నామా నాగేశ్వర్ రావుతో కలిసి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 17వ తేదీన హుజూర్నగర్లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో ఇక్కడ జరిగే అభివృద్ధి గురించి సీఎం మాట్లాడుతారు. సీఎం బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలిరావాలని ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి విన్నవించారు.
