యువతకు అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హెచ్ఐసీసీలో సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరై అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. టీఎస్ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. ప్రైవేటు సెక్టార్లోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, తెలంగాణ సీఐఐ చైర్మన్ డి.రాజు తదితరులు పాల్గొన్నారు.
