ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పొరెడ్డిపల్లి గ్రామ చెక్ డ్యామ్ పొంగి పోర్లుతున్నది. ఆలస్యంగానైనా వర్షాలు కురవడంతో వాగులు, కుంటలకు పూర్తిస్థాయిలో నీరు చేరింది. చాలా రోజుల తర్వాత పొరెడ్డిపల్లి చెక్ డ్యాం పొంగిపొర్లుతుండటంతో ఆ ప్రాంత రైతులు సంబురంతో గ్రామంలో పండుగ జరుపుకున్నారు. ఈ పండుగ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుని ఆహ్వానించగా ఆదివారం మధ్యాహ్నం పొరెడ్డిపల్లి గ్రామానికి మంత్రి చేరుకుని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. డ్యామ్ లో నీళ్లు చుసిన మంత్రి గారు ఆనందం వ్యక్తం చేస్తూ అక్కడికి వచ్చిన మహిళా రైతులను ఆప్యాయంగా పలకరించి మిఠాయిలు తినిపించి వారితో సంబురాన్ని పంచుకున్నారు. ఈ ప్రాంతంలో దాదాపు 10 వేల పైచిలుకు ఎకరాలకు భూగర్భ జలాలు పెరిగి బీడు భూములు సాగులోకి వచ్చే అవకాశం ఉన్నదని మంత్రితో ఇరిగేషన్ ఇంజనీర్లు ముచ్చటించారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం కోసం సీఏం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ చూపారని మంత్రిని శాలువాతో సన్మానించారు. ఈ మేరకు డ్యాంలో నీళ్లు నిండాయని ఆనందంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున చెక్ డ్యాం వద్దకు తరలి వచ్చారు. కాగా చెక్ డ్యాం వద్ద జలకళ రావడంతో గ్రామ మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి గంగమ్మ తల్లికి జలహారతి పత్తి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనంత రెడ్డి, గ్రామ సర్పంచ్ తో పాటు పలువురు ప్రముఖ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
