ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ‘నీరా’ అమ్మకాలకు త్వరలోనే శ్రీకారం చుడతామని ఎక్సైజ్శాఖ మంత్రి వి. శ్రీనివాస్గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని టాంక్బండ్ పరిసరాల్లో ప్రయోగాత్మకంగా స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. నీరా పాలసీ, మార్గదర్శకాలను సోమవారం ఆర్ధికశాఖ మంత్రి హరీశ్రావు, మున్సిపల్శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. ఈసందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు నీరా పాలసీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అన్నారు. గత 70 సంవత్సరాలుగా గీత కార్మికుల పై ఆంక్షలు పెట్టడం వల్లనే వారి వృత్తికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. గత ప్రభుత్వాలు నీరా కోసం ఇతర దేశాలు తిరిగారు కానీ ఇక్కడ అమ్మడానికి అనుమతించలేదన్నారు. సీఎం కేసీఆర్ గౌడవృత్తిని కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ముందుగా హైదరాబాద్లో నీరా అమ్మకాలు ప్రారంభించాక దశల వారీగా అన్నిజిల్లాల్లో ఉత్పత్తి, సరఫరా చేస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ నిరా స్టాల్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ముందుగా టాంక్బండ్ వద్ద మొదటిస్టాల్ ఏర్పాటుచేస్తామని చెప్పారు. నీరాలో అనేక ఔషధగుణాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నీరా అమ్మకాల లైసెన్స్ గౌడ కులానికి మాత్రమే ఇస్తామని అన్నారు. నీరాను గీయడం, అమ్మడం గౌడలు మాత్రమే చేయాలని సీఎం చెప్పారన్నారు. నీరాను సేవించడం వల్ల మధుమేహ వ్యాధి కూడా తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
