గిరిజన ప్రాంతాల్లోని రైతుల భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అమలవుతున్న గిరివికాసం పనులను వేగవంతం చేయమని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. ఈ పధకం కింద వెంటనే లబ్దిదారుల గుర్తింపు పనులను పూర్తి చేయాలన్నారు. గిరి వికాసం పథకంపై నేడు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేడు రెండు శాఖల అధికారులతో సమీక్ష చేశారు.
గిరివికాసం పథకం కింద ఇప్పటికే దాదాపు 46 కోట్ల రూపాయల విలువైన పనులకు గిరిజన శాఖ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఈ ఏడాది 61 కోట్ల రూపాయలను కూడా గిరివికాసం కోసం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. త్వరలోనే గిరివికాసం పనులను వేగవంతం చేయడంలో భాగంగా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా అంగన్ వాడీ భవనాలకు కూడా మ్యాచింగ్ గ్రాంట్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వెంటనే ఇచ్చే విధంగా చూడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఈ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల సాయం ఉన్నందున ఆలస్యం చేయకూడదని చెప్పారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ రఘునందన్ రావు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, ఇతర అధికారులు పాల్గొన్నారు.