టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే బీజేపీ అడ్డుపడుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటి వరకు అభివృద్ధిని అడ్డుకోవడానికి 16 లేఖలు ఇచ్చిందన్నారు. కరీంనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. కరీంనగర్లో స్మార్ట్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు గ్రహించాలని… అభివృద్ధి నిరోధకులను ఓడించాలని పలుపునిచ్చారు. ఇప్పటి వరకు 50 శాతం పనులు మాత్రమే జరిగాయని… మిగిలిన 50 శాతం పనులకు నిధులు సిద్ధంగా ఉన్నాయన్నారు.
ఐటీ టవర్లో తమ శాఖల ఏర్పాటుకు 18 కంపెనీలు ముందుకొచ్చాయని చెప్పారు. ఇది కరీంనగర్ యువతకు సువర్ణావకాశమని… భవిష్యత్లో కరీంనగర్ ఐటీ హబ్గా మారుతుందన్నారు. మరో ఐటీ టవర్ నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందించామని వెల్లడించారు.మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆయన.. ఈనెల 27న మున్సిపల్ ఎన్నికల శంఖారావం పూరించనున్నామని పేర్కొన్నారు. ఒక్కో డివిజన్కు ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నామని. ఈ కమిటీ డివిజన్లలో పర్యటించి, పరిశీలించి సభ్యులను ఎంపిక చేస్తుందని మంత్రి వివరించారు.