కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల సంఖ్య 4 కోట్లు దాటింది. రాష్ట్రంలో 18 ఏండ్లు దాటినవారు 2.77 కోట్ల మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ రెండు డోసుల చొప్పున 5.55 కోట్ల టీకాలు వేయాల్సి ఉన్నది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా గురువారం నాటికి 4 కోట్ల డోసులను వేసింది.
వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,970 వాక్సినేషన్ బృందాలు పని చేస్తున్నాయి. ప్రభుత్వ పరిధిలో 3,500 కేంద్రాల్లో, ప్రైవేట్లో 264 కేంద్రాల్లో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. మొత్తం 35 వేల మంది సిబ్బంది వ్యాక్సినేషన్లో పాలుపంచుకొంటున్నారు. ఇందులో 10 వేల మంది వ్యాక్సినేటర్లు ఉన్నారు. ఇప్పటివరకు వేసిన 4 కోట్ల టీకాల్లో ప్రభుత్వ కేంద్రాల నుంచి 87 శాతం పంపిణీ చేయగా, 13 శాతం ప్రైవేట్ కేంద్రాల్లో వేశారు.
కాగా, టీకాలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యాచరణ అమలు చేస్తున్నది. అర్హులను 44 క్యాటగిరీలు విభజించి టీకాలు వేస్తూ వస్తున్నది. ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఒక్కరికి టీకా వేస్తున్నది. ప్రయాణ ప్రాంగణాలు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి టీకాలు వేస్తున్నది.