తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల కాక మరింత పెంచుతుంది.ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక రద్దు కోసం కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయని తెలంగాణ జన సమితి అధినేత, ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఈరోజు మంగళవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికలో ఎన్నికల నియమావళి అమలు కావటం లేదని ఆయన ఆరోపించారు.
మంత్రులు అధికార హోదాను ఉపయోగించుకుని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. మంత్రులకు ఎస్కార్ట్ వాహనాలు ఇవ్వటానికి వీలు లేదన్నారు. అధికార దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.మునుగోడులో అధికారికంగా మద్యం పంపిణీ జరుగుతోందని కోదండరామ్ ఆరోపించారు.
ఒక మంత్రి ప్రచారానికొస్తే.. హైవేను మూసివేటం దుర్మార్గమన్నారు. మతం, కులం పేరుతో ఓట్లు అడగటం ఎన్నికల నియమావళిని ఉల్లఘించటమేనన్నారు. ప్రణాళిక ప్రకారమే ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోందన్నారు. ఎన్నికల ప్రక్రియ మీద ప్రజలకు నమ్మకం పోయిందని, మునుగోడుకు ఎన్నిక అవసరం లేదని, పార్టీలు ఖర్చు చేస్తున్న వెయ్యి కోట్ల రూపాయలతో మునుగోడును అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చునని కోదండరామ్ అన్నారు.