గతంలో మాదిరిగా అటెండర్, డ్రైవర్ పోస్టులకే ప్రాధాన్యం ఇవ్వకుండా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో అగ్రికల్చర్, ఇరిగేషన్, హెల్త్ సెక్టార్లలో ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడుతున్నదని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాల భర్తీకి జీవోలు జారీ చేసిందని వెల్లడించారు. ఇప్పటి వరకు 29,644 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, 26 వేల ఉద్యోగాలకు పరీక్షలు పూర్తయ్యాయని వివరించారు. త్వరలోనే గ్రూప్-2 నియామకాల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. వచ్చే మార్చికల్లా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తవుతుందని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు.
వ్యవసాయ శాఖలో 2100 ఉద్యోగాలు భర్తీ చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. వెటర్నరీలో 500 ఉద్యోగాలు భర్తీ చేశామని, వారం రోజుల్లో వారికి నియామక పత్రాలు అందజేస్తామని వెల్లడించారు.9 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామని ఘంటా చక్రపాణి తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. 1600 పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, మరో 4 వేల డాక్టర్ పోస్టుల భర్తీ చేయనున్నామని వెల్లడించారు.
వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయాలంటే యూపీఎస్సీ రెండేళ్లు సమయం తీసుకుంటుందని చక్రపాణి గుర్తుచేశారు. తక్కువ సమయంలోనే 30 వేల ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుందని తెలిపారు. ఇంత వేగంగా దేశంలో ఏ సర్వీస్ కమిషన్ కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టలేదన్నారు. రెండున్నరేళ్లలో 175 పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించారు. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు 20 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యం కావడానికి కమలనాథన్ కమిటీ కూడా కారణం టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న మొత్తం 30 వేల ఉద్యోగాల్లో వెయ్యి ఉద్యోగాలు మాత్రమే కోర్టు వివాదాల్లో ఉన్నాయని వెల్లడించారు. మిగతా పోస్టుల భర్తీకి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఉద్యోగాల నియామక ప్రక్రియలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎక్కువ సమయం తీసుకుంటోందని తెలిపారు.