బీసీల సంక్షేమం విషయంలో తెలంగాణ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశం అయిన అనంతరం మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశం శుభ పరిణామమని అన్నారు. వృత్తులను మూడు రకాలుగా విభజించమని సీఎం కేసీఆర్ అన్నారని మంత్రి ఈటల తెలిపారు. వృత్తి ద్వారా సంపద సృష్టించే వారిని గుర్తించి 5 వేల కోట్లు కేటాయించమన్నారని వివరించారు.
ఈ నిర్ణయంలో భాగమే గోర్లు, చేపల పంపిణీ అని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. రెండవదీ సర్వీస్ ఓరియంటెడ్ రజకులు, క్షురకులు ఇతరులు ఇప్పటికే జోగురామన్నగారి ఆధ్వర్యంలో మెషిన్ల పంపిణీ ఆర్థిక సహకారం అందించామన్నారు. ఇక మూడవది అంతరించిపోతున్న వృత్తులని పేర్కొంటూ వాటిని కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. మూడు రోజులు సమగ్రంగా చర్చించి నివేదిక ఇవ్వమన్నారని తెలిపారు.ఈ నివేదికను ఉన్నది ఉన్నట్టు అమలు చేస్తామని..అవసరమైచతే చట్టం తెస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.
చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు కావాలని ఇవాళ బీసీ ప్రజాప్రతినిధుల సమావేశంలో తీర్మానం చేశామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేంద్రంలోనూ బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. ఈ విషయంలో తెలంగాణ స్పూర్తిగా నిలుస్తున్నదని పేర్కొన్నారు.