ఆరు ఖండాల్లోని 41 దేశాల నుంచి 450 మంది తెలుగు ఎన్నారైలు ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరవుతున్నారని తెలుగు మహాసభల ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ దేశాల్లోని తెలుగువారు సైతం హాజరైతే బాగుంటుందని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చెప్పారని, ఆ మేరకు 41 దేశాల్లోని 450 మంది ప్రతినిధులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
దక్షిణాఫ్రికాలోని మలావిలాంటి దేశంలోనూ మన తెలుగువారున్నారని, అక్కడి నుంచి హాజరవుతున్నారని వివరించారు. బోట్స్వానా, కొలంబియా, ఇథియోపియా, ఫిజీ, ఉగాండా లాంటి దేశాల నుంచికూడా ప్రతినిధులు హాజరవుతున్నారని చెప్పారు. ఒక్క మలేషియా నుంచే 100 మంది తెలుగువారు, న్యూజెర్సీ నుంచి డిప్యూటీ స్పీకర్ ఉపేందర్ చివుకుల లాంటివారుకూడా హాజరవుతున్నారని మహేశ్ బిగాల వివరించారు. ప్రతినిధుల ఎంపిక కోసం వివిధదేశాల్లో 13 సన్నాహక సదస్సులు నిర్వహించామని తెలిపారు. హాజరవుతున్న ప్రతినిధుల్లో 40 మంది సాహితీవేత్తలు ఉన్నారని చెప్పారు.
ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ తెలుగు వారున్నా.. మూణ్నాలుగు తరాలుగా అక్కడే స్థిరపడటంతో.. తెలుగు భాష ప్రభావం క్రమేణా తగ్గుతున్నదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. తెలుగు మాట్లాడుతున్నారేగానీ.. రాయటం, చదవటం అనేది తగ్గుతున్నదని చెప్పారు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ప్రీమౌంట్లో అన్ని స్కూళ్ళలో ఒకటి నుంచి 12వ స్టాండర్డ్ వరకు తెలుగును రెండో భాషగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల తర్వాత ప్రతి దేశంలోనూ ఫ్రీమౌంట్ తరహాలో నిర్ణయం కోసం ఒత్తిడి పెరుతుందని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలను తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్నారని చెప్పినప్పుడు వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు చాలా సంతోషించారని ఆయన చెప్పారు.