హైదరాబాద్ను యాచక రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇందుకు తగిన చర్యలు తీసుకున్నారు. అయితే కొందరు హైద్రాబాద్ లో నవంబర్ చివరి వారంలో జరిగిన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హడావుడి చేస్తున్నారు.ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ మరియు ఎందరో ప్రముఖులు వస్తుండటంతో ఇలా చేశారు అంటూ కామెంట్లు చేశారు.
అయితే ఈ సదస్సుకు ముందుగానే సిటీలోని రోడ్లపై యాచించే వారిని పట్టుకుని షెల్టర్లకు తరలించారు. సదస్సు అనంతరం వారందరిని వదిలేస్తారనుకున్నారు నగర ప్రజలు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఈ నెల 20వరకు భాగ్యనగరాన్ని బిచ్చగాళ్ల రహితంగా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని జైళ్ల శాఖ వీకే సింగ్ తెలిపారు. డిసెంబర్ 1నుంచి నగరంలోని అన్ని చోట్లలో ఉన్న బిచ్చగాళ్లను పట్టుకుంటున్నామని అయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుండి నగరంలో ఎక్కడైనా బిచ్చగాళ్ళు కనిపించినా సమాచారం ఇవ్వమని కోరారు.
అలా సమాచారం అందించినవారికి 500రూపాయలు బహుమానం కూడా ఇస్తామని తెలిపారు. యాచకుల సమాచారం కోసం 040-24511791, 040-24527846 నంబర్లకు డయల్ చేయని చెప్పారు. ఇప్పటి వరకు దాదాపు 500మందిని పట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చామని వారిలో కొంత మందిని తమ బందువులకు అప్పగించాం, మిగిలిన వారికి అనాధ శరణాలయంలో ఆశ్రయం కల్పించామని తెలిపారు.