తెలంగాణ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు మంచివే అయినప్పటికీ…ఇటీవలి కాలంలో కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు తాజా నిదర్శనం ఫీజుల పెంపుపై తిరుపతిరావు కమిటీ నివేదిక.వాస్తవానికి ఈ నివేదికలో ఏముందనే విషయం తెలుసుకోకుండానే కొందరు విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ స్కూళ్లకు ప్రొ.తిరుపతిరావు కమిటీ ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటుస్కూళ్లు లాభాపేక్ష అనేది ఏమాత్రం లేకుండా ఫీజులు వసూలు చేయాల్సిందేనని కమిటీ స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన కమిటీ సిఫారసుల ప్రకారం గతంలో మాదిరిగా ఐదుశాతం లాభం కూడా ఆర్జించడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. అసలు లాభాల ఊసెత్తకుండా ఇకనుంచి పాఠశాలలను జీరోప్రాఫిట్తోనే నడిపించాలని.. కరస్పాడెంట్ కూడా నెలనెలా జీతమే తీసుకోవాలని చెప్పింది. ప్రతిరూపాయికీ లెక్కలు పక్కాగా ఉండాలని.. ఒక్కశాతం ఫీజు పెరిగినా అది యాజమాన్యాలకు లాభంగా పరిణమించకూడదని అభిప్రాయపడింది. ఇప్పటికే లాభాలు ఆర్జిస్తున్న స్కూళ్లు వసూలు చేస్తున్న ఫీజులు కూడా కచ్చితంగా నియంత్రణ పరిధిలోకి రావాలని తిరుపతిరావు కమిటీ సూచించింది.
ఇప్పటివరకు ఆదాయవ్యయాలు పోను 5 శాతం లాభాలు పొందవచ్చని గతంలో జీవో ఇచ్చినా… కానీ ఆ ఐదుశాతం లాభాలను కూడా ఆర్జించకుండా.. పూర్తిగా సేవాభావంతో ప్రైవేటు పాఠశాలలను కొనసాగించాల్సి ఉందని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ గట్టిగా సిఫారసు చేసింది. ప్రైవేటుస్కూల్ ఫీజుల నియంత్రణపై ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ 52 పేజీల నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. కమిటీ సిఫార్సులు దేశంలోనే ఆదర్శవంతంగా ఉంటాయని, వీటిని ప్రభుత్వం అమలు చేస్తే భవిష్యత్తులో ప్రైవేటుస్కూల్ ఫీజులు పూర్తిగా అదుపులోకి వస్తాయని ప్రొఫెసర్ తిరుపతిరావు చెప్పారు.